ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయో ప్రశ్నించుకోవాలని అమెరికా ప్రజలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సూచించారు. తమపై దాడుల నేపథ్యంలో అమెరికా ప్రజలను ఉద్దేశించి పెజెష్కియాన్ ఓ బహిరంగ లేఖ రాశారు. అమెరికన్లతో గానీ, ఇతర దేశాలతో గాని తమకు శత్రుత్వం లేదన్నారు. వక్రీకరణలు, కల్పిత కథనాల వెల్లువను దాటి చూడాలని విజ్ఞప్తి చేశారు.అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రత్వం లేదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అనేక సార్లు అమెరికా తమను నియంత్రించాలని చూసినప్పటికీ, ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదన్నారు. ప్రస్తుతం తమపై చేస్తున్న దాడులను ధైర్యంగా, దృఢంగా తిప్పికొడుతున్నామన్నారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. పరిపాలనలో దానిని పక్కన పెట్టారన్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రజల ప్రయోజనాలు ఎలా నెరవేరుతున్నాయని ప్రశ్నించారు ‘అమాయక పిల్లలపై సామూహిక హత్యాకాండ, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధ సౌకర్యాల విధ్వంసం, ఒక దేశాన్ని రాతియుగానికి నెట్టేస్తామని బాంబులు వేయడం.. వీటి వల్ల అమెరికన్లకు కలిగే లాభమేంటి? ప్రపంచ స్థాయిలో అమెరికా ప్రతిష్టను మరింత దెబ్బతీయడం తప్ప మరే ఇతర ప్రయోజనానికైనా ఈ విధ్వంసాలు ఉపయోగపడతాయా?’ అని ప్రశ్నించారు. అమెరికా -ఇజ్రాయెల్ దాడుల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు ఇరాన్కు ఉందన్నారు..



